మద్యం అనేది ఎంతటి పని అయినా చేయిస్తుంది. మద్యం మత్తులో ఉన్నవారు ఒక్కోసారి ఒళ్లు జలదరించే పనులు చేస్తుంటారు. తీరా తెలివి వచ్చాక వారు చేసిన పని తలచుకుని వారికే భయం కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి అక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
చత్తీస్గడ్లోని కోర్బాలో ఉన్న ఇందిరానగర్ అనే ప్రాంతంలో రాజు జంగ్డె, హితేంద్ర ఆనంద్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి వారు పీకలదాకా మద్యం సేవించి గ్రామంలో చోట డ్రెయినేజీ దగ్గర ఆగారు. అక్కడ మంటల్లో సగం వరకు కాలిపోయిన పామును వారు చూశారు. అయితే అది ఇంకా బ్రతికే ఉంది.
ఈ క్రమంలో వారు ఆ పామును తీసుకుని కరకరా నమిలి తినడం మొదలు పెట్టారు. ఇద్దరూ తల భాగాన్ని కొరికి తిన్నాక మిగిలిన భాగాన్ని నమిలి మింగారు. వెంటనే ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇంటికి వెళ్లగానే ఇద్దరూ కళ్లు తిరిగి, వాంతులు చేసుకుంటూ పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
హాస్పిటల్లో వైద్యులు చికిత్స చేసి వారిని రక్షించారు. కొంత ఆలస్యం అయి ఉంటే వారి ప్రాణాలు పోయి ఉండేవని, ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులు క్షేమంగానే ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
అయితే పామును ఎందుకు కొరికి తిన్నారని ప్రశ్నించగా.. తమ గ్రామంలో పాములు బాగా తిరుగుతున్నాయని, అందుకే కోపం వచ్చి కొరికేశామని, లేకపోతే అది ఎవరినైనా కాటు వేస్తుందని భావించామని, అందుకనే ఆ పనిచేశామని చెప్పారు. దీంతో వారి సమాధానం విన్నవారు షాకయ్యారు. అయితే నిజానికి అది అత్యంత విష పూరితమైన పాము అని, అది కాటు వేస్తే 15 నిమిషాల్లోనే చనిపోతారని, అలాంటిది ఆ ఇద్దరూ బతికారంటే వారికి భూమిపై ఇంకా నూకలు ఉన్నందు వల్లేనని వైద్యులు తెలిపారు.