దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవించడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే గుజరాత్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో కరోనా కట్టడి చర్యలలో భాగంగా అక్కడి ప్రభుత్వం భారతదేశ అపరకుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహాయం కోరింది.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖేష్ అంబానీ సహాయం కోరగా అందుకు ముఖేష్ అంబానీ సానుకూలంగా స్పందించి వెయ్యి పడకలు కలిగిన కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుకు కంపెనీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీరు ఏర్పాటు చేయబోయే ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాతో సహా వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఉన్న జామ్నగర్లో ఈ భారీ కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఆదివారంలోగా 400 పడకలతో ఏర్పాటు చేస్తామని త్వరలోనే 1000 పడకలకు పెంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విపత్కర పరిస్థితులలో రిలయన్స్ అధినేత ఈ సహాయం చేయడం పట్ల అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.