దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శనివారం కొత్తగా 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య కూడా ఇదే కావడం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,32,05,926 కు చేరుకుంది. కాగా కరోనా ప్రభావం దేశంలో మొదలైనప్పటి నుంచి రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 1 లక్ష మార్కును దాటడం ఇది 5వ సారి. ఏప్రిల్ 5వ తేదీన 1,03,558 కోవిడ్ కేసులు నమోదు కాగా, 7న 1,15,736 కేసులు నమోదయ్యాయి. అలాగే ఏప్రిల్ 8వ తేదీన 1,26,789 కేసులు, 9వ తేదీన 1,31,968 కేసులు నమోదయ్యాయి.
శనివారంతో దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఆ సంఖ్య 10,46,631కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 794 మంది చనిపోయారు.
గత సెప్టెంబర్ నెల తరువాత దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటడం మళ్లీ ఇదే తొలిసారి. సెప్టెంబర్ 20, 2020వ తేదీన 10 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 77,567 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.