చదువు చదివేందుకు వయస్సుతో పనిలేదు. ఏ వయస్సులో అయినా ఏ కోర్సు అయినా చదవవచ్చు. ఈ విషయాన్ని గతంలో ఎంతో మంది నిరూపించారు. ఇప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని చాటి చెప్పారు. ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వెయిన్ ఎట్టకేలకు 10 తరగతి పరీక్షల్లో పాస్ అయ్యారు. ఆయన వయస్సు 49 ఏళ్లు.
ఒడిశాలోని అధికార బిజు జనతా దళ్ పార్టీకి చెందిన సురద ఎమ్మెల్యే పూర్ణ చంద్ర ఆ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామ్ 10వ తరగతిలో బి2 గ్రేడ్ సాధించి పాస్ అయ్యారు. మొత్తం 500 మార్కులకు గాను ఆయన 340 మార్కులను సాధించడం విశేషం. అక్కడి గంజామ్ జిల్లాలో ఉన్న సురదలోని ఎస్బీ హై స్కూల్లో ఆయన పరీక్ష రాశారు.
ఇక 10వ తరగతిలో ఆయన మార్కుల విషయానికి వస్తే పెయింటింగ్ లో 85, ఇంగ్లిష్లో 44, సైన్స్లో 83, సోషల్లో 61, ఒడియాలో 67 మార్కులను సాధించారు. ఒక్కో సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులను కేటాయించారు. అయితే ఆయన పెయింటింగ్లో ఎక్కువ మార్కులను సాధించడం విశేషం.