బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా మేకలు, గొర్రెల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఓ మేక ధర ఏకంగా రూ.1 కోటి పలికింది. అంతటి భారీ ధర పలికే సరికి ఆ మేకను చూసేందుకు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు.
సదరు మేక పేరు టైగర్. పుష్టిగా, ఆరోగ్యంగానే ఉంది. అయితే దానిపై అల్లా అని అర్థం వచ్చే విధంగా చిహ్నాలు ఉన్నాయి. పుట్టుకతోనే దానికి అవి వచ్చాయి. అందువల్లే ఆ మేకకు ఎంతటి ధర అయినా వెచ్చించి దాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. సదరు మేకు రూ.36 లక్షల వరకు చెల్లించేందుకు కొందరు ముందుకు వచ్చారు. కానీ యజమాని మాత్రం రూ.1 కోటి చెబుతుండడం విశేషం.
ఇక మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్లో కొన్ని మేకలు రూ.11 లక్షల ధర పలుకుతున్నాయి. అల్లా, అహ్మద్ అని చిహ్నాలు కలిగిన మేకలు కావడంతో ఆ మేకలకు అంతటి ధర చెబుతున్నారు. ఇక ఇలాంటివే కొన్ని మేకలకు రూ.5.50 లక్షల వరకు ధర చెబుతున్నారు. కాగా బక్రీద్ను సౌదీ అరేబియాలో ఈ నెల 20వ తేదీన జరుపుకోనున్నారు. మన దేశంలో 21న జరుపుకుంటారు.
బక్రీద్ రోజు అల్లాకు మాంసాన్ని నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మేకలు లేదా గొర్రెలను బలి ఇచ్చాక వాటి మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఒక భాగాన్ని పేదలకు, రెండో భాగాన్ని బంధువులు, స్నేహితులకు ఇస్తారు. మూడో భాగాన్ని తాము ఉంచుకుంటారు. దీని వల్ల అల్లా దయ చూపిస్తాడని, ఆశీర్వచనాలు ఇస్తాడని నమ్ముతారు.