India vs Newzealand : కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసే దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 258 పరుగుల స్కోరు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేయగా, శుబమన్ గిల్ 93 బంతులు ఆడి 5 ఫోర్లు, 1 సిక్సర్తో 52 పరుగులు చేశాడు.
చటేశ్వర్ పుజారా 88 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 63 బంతులు ఆడి 6 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం క్రీజులో అయ్యర్ 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల స్కోరు వద్ద ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతున్నాడు. కివీస్ బౌలర్లలో కైలీ జేమిసన్ 3 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీకి 1 వికెట్ దక్కింది.