Hema : మా ఎన్నికలలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు బయట మీడియాతో గత రెండు రోజులుగా అవకాశం దొరికినప్పుడల్లా మంచు విష్ణు ప్యానెల్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాటికి మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కూడా ప్రత్యారోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నటి హేమ.. మా ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా దేవిని నటి హేమ దర్శించుకుంది. అమ్మవారు 8వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే నటి హేమ అమ్మవారిని దర్శించుకుని చీరను సమర్పించారు.
అయితే ఆలయం నుంచి బయటకు వస్తుండగా.. ఒకరు తనకు చీరను ఇచ్చారని.. దాన్ని అమ్మవారే స్వయంగా తనకు ఇచ్చినట్లు భావిస్తున్నానని హేమ తెలిపింది. అమ్మవారు సత్యదేవత అనేందుకు ఇది నిదర్శనమని.. మా ఎన్నికల నేపథ్యంలో జరిగిందేమిటో అమ్మవారికి తెలుసని వ్యాఖ్యానించింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడను.. అంటూనే హేమ.. రాత్రి గెలిచామని, పొద్దున వరకు ఓడిపోయామని అన్నారని.. ఇలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని చెప్పింది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఎన్నికల రోజు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు చెందిన ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారిని కోరారు. అందుకు ఆయన ఫుటేజ్ ఇస్తామని చెప్పారు.