Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ అభిమానులకి మరో బ్యాడ్ న్యూస్. తమ అభిమాన హీరో మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేని బాధలో ఉన్న ఫ్యాన్స్కి మరో పెద్ద షాక్ తగిలింది. బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురు బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బంధువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ల ట్రక్కు సుమోను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని అక్కడి వారు ఆస్పత్రికి తరలించారు. వీరంతా సుశాంత్ సింగ్, బీహార్ మంత్రి నీరజ్ సింగ్ బబ్లూ బంధువులుగా అధికారులు గుర్తించారు.
హల్సీ పోలీస్స్టేషన్ పరిధిలోని సికంద్రా-షేక్పూర్ ప్రధాన రహదారిపై పిప్రా గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని.. సమాచారం మేరకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి దహన సంస్కారాల కోసం పాట్నా వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కారును ట్రక్కు బలంగా ఢీకొట్టింది.
సుమో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.