టాలీవుడ్ నిర్మాతలు బడ్జెట్ పెరిగి పోతుంది. సినిమాలను నిర్మించడం మా వల్ల కావడం లేదు బాబోయ్ అంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లు నిలిచి పోయి వారం రోజులు అవుతోంది. షూటింగ్ లు మళ్లీ ఎప్పుడు పునః ప్రారంభం అవుతాయి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. షూటింగ్ లను ప్రారంభించాలంటే హీరోల పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. వారి భారీ ఖర్చులు తగ్గించుకోవాల్సిందే.. అంటూ డిమాండ్ చేస్తున్నారు.
షూటింగ్ లు ప్రారంభం అయ్యేది ఎప్పుడో తెలియడం లేదు కానీ మరో వైపు హీరోలు తమ పారితోషికాలు మాత్రం మరింతగా పెంచేస్తూనే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇక ప్రాజెక్ట్ కే ఒక అంతర్జాతీయ సినిమా కనుక అంతకు మించిన బడ్జెట్ ఉంటుంది. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కచ్చితంగా రూ.20 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అంతే కాకుండా ప్రభాస్ డేట్లు వృథా అవుతుండడంతో రూ.5 నుండి రూ.10 కోట్ల వరకు నష్టం అని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నిర్మాతల బంద్ వల్ల ఇండస్ట్రీలో అత్యధికంగా ఎఫెక్ట్ అవుతున్న హీరో ప్రభాస్ అని చెప్పవచ్చు. ఈ సమ్మె ఎప్పటికి ఆగి పోయేనో.. ఎప్పుడు షూటింగ్ లు పూర్తి స్థాయిలో జరిగేనో చూడాలి. ఈ సమ్మెతో హీరోలు దిగివస్తారో లేదా నిర్మాతలే సమ్మె విరమించుకుంటారో వేచి చూడాలి.