Bigg Boss 5 : బిగ్ బాస్ 8వ వారంలో భాగంగా శనివారం నాగార్జున హౌస్ సభ్యులతో ముచ్చటిస్తూ వారంలో వారు చేసిన తప్పు ఒప్పుల గురించి మాట్లాడుతూ హౌస్ సభ్యులకు క్లాస్ పీకారు. ఈ క్రమంలోనే నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ ను సేవ్ చేయడం కోసం పలు టాస్క్ లను నిర్వహించారు. ఈ క్రమంలోనే పూరీలు చేసే టాస్క్, అలాగే వైకుంఠపాలి ఆటను కూడా కంటెస్టెంట్ లతో ఆడించారు. ఈ ఆట తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెడలో మోత – సరిపోయే సామెత అని గేమ్ ఆడించారు.
ఈ ఆటలో భాగంగా నాగార్జున సామెతలు చదివితే కంటెస్టెంట్ లు ఆ సామెత ఎవరికీ సరిగ్గా సరిపోతుందో ఆ సామెత తీసుకెళ్ళి ఆ కంటెస్టెంట్ మెడలో వేయాలి. ఈ క్రమంలోనే కుక్క తోక వంకర అనే సామెతను సన్ని తీసుకెళ్లి జేసీ మెడలో వేశాడు. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి అనే సామెతను మానస్ తీసుకెళ్లి రవి మెడలో వేశాడు. అలాగే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెతను కాజల్ శ్రీరామ్ కి అంకితం ఇచ్చింది. అనీమాస్టర్ రాను రాను రాజు గుర్రం గాడిద అయింది అనే సామెతను తీసుకెళ్లి కాజల్ కి అంకితం చేసింది.
కందకు లేని దురద కత్తిపీటకెందుకు అనే సామెతను ప్రియాంక సిరి మెడలో వేసింది. అంతంత కోడికి అర్థ సేరు మసాలా ఎందుకు అనే సామెతను శ్రీరామ్ కాజల్ కు సూట్ అవుతుందని చెప్పాడు. ఇక విశ్వా దున్నపోతు మీద వర్షం పడినట్టు అనే సామెతను లోబోకి అంకితం చేశాడు. పైన పటారం లోన లొటారం అని సామెతను సన్నీకి జెస్సీ అంకితం చేశాడు. అందని ద్రాక్ష పుల్లన అనే సామెతను సిరి షన్నుకు ఇచ్చింది.
ఏకులా వచ్చి మేకులా దిగాడు అనే సామెత షన్ను రవికి ఇచ్చాడు. రవి ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న దిగిన తర్వాత బోడి మల్లన్న అనే సామెతను మానస్ కి ఇవ్వగా.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే సామెతను లోబో అనీ మాస్టర్ కి అంకితం చేశాడు. ఇలా ఈ గేమ్ అయిన తర్వాత నాగార్జున ఎవరు సేవ్ అయ్యారు అనే విషయాన్ని చెప్పకుండా సస్పెన్స్ పెడుతూ నేటి ఎపిసోడ్ గురించి మాట్లాడారు. ఇక నేడు దీపావళి సందర్భంగా యాంకర్ సుమ, శ్రీయ స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది.