Balakrishna : జీవితం క్షణ భంగురం అన్న పెద్దల మాటను మళ్ళీ నిజం చేశాడు పునీత్ రాజ్ కుమార్. 46 ఏళ్ల వయస్సులో ఆయన అకాల మరణం ప్రతి ఒక్కరినీ శోకసంద్రంలోకి నెట్టింది. పునీత్ మరణంతో శాండల్ వుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు విలపిస్తున్నారు. పునీత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
పునీత్ అంత్యక్రియలు జరగనుండగా, ఆయన చివరి చూపు కోసం టాలీవుడ్ ప్రముఖులు కూడా బెంగళూరు వెళుతున్నారు. ఈ క్రమంలోనే కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్కు నివాళులర్పించారు బాలయ్య. పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్కుమార్ని పరామర్శించారు. బాలకృష్ణతోపాటు నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు.
పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 46 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఆయన పార్థీవదేహాన్ని ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఉన్నారు. పునీత్ భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.