Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేయనుంది. ఈ మేరకు అమెజాన్ తాజాగా నిర్ణయం తీసుకుంది. తమ వద్ద కష్టపడి పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి జీతం పెంచడం ద్వారా కంపెనీ మారకుండా చూసేందుకు గాను అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా అమెజాన్లో సుమారుగా 16 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తుండగా.. వీరిలో కొందరికి నెలవారీ వేతనాలను అందిస్తున్నారు. ఇక కొందరు పనిచేసిన గంటలకు తగినట్లుగా వేతనాలను పొందుతున్నారు. అయితే వీరిలో ఎవరెవరికి జీతాలు పెరగనున్నాయనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఉద్యోగులు, సిబ్బంది పనితీరు ఆధారంగా అందరికీ జీతాలు పెంచడంతోపాటు కొందరికి ప్రమోషన్స్ను కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇక వేతనాల పెంపుతోపాటు అత్యంత ఎక్కువ ప్రదర్శన చేసిన వారికి తమ కంపెనీకి చెందిన షేర్స్ను కూడా ఇవ్వాలని.. అమెజాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో పనిచేస్తున్న అమెజాన్ సిబ్బంది వేతనం గంటకు రూ.1340గా ఉంది. కొందరు గంటల ఆధారంగా పనిచేస్తారు. వారికి ఈ వేతనం చెల్లిస్తున్నారు.
గత వారం రోజుల కిందట అమెజాన్ షేర్ల విలువ కూడా బాగానే పెరిగింది. దీంతో అమెజాన్ కంపెనీ విలువ ప్రస్తుతం 1.6 ట్రిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.1,41,82060 కోట్లు) చేరుకుంది.