ఆమని.. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమని.. శుభలగ్నం, దొంగ వంటి చిత్రాలతో మెప్పించారు. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ఇటీవల చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాల్లో నటించారు. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడూ జడ్జిగా వ్యవహారిస్తున్న ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.
ఆమని తెలుగమ్మాయి అయినప్పటికీ తల్లిదండ్రులు బెంగళూరులో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. తండ్రి డిస్ట్రిబ్యూటర్ అవ్వడంతో సినిమాల్లో నటించాలని ఆమని అనుకున్నారు. ఇక చెన్నై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించింది. అవకాశాల కోసం వెళ్లిన మొదట్లో అడిషన్ కోసం వెళితే రేపు వచ్చి గెస్ట్ హౌస్ లో కలవమని చెప్పారట. అది కూడా ఒంటరిగా రమ్మనడంతో వాళ్ళు ఏ ఉదేశ్యంతో పిలుస్తున్నారో అర్థమైంది అని, అప్పట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పారు ఆమని. అయితే ఆమని అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా సినిమాలకు దూరం అవ్వలేదు.
బాపు, కే విశ్వనాథ్ వంటి లెజెండరీ డైరెక్టర్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి అనేక మంది ఇటీవల ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నారు. తమిళనాట శరత్ కుమార్ కూతురు.. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నట్లు తెలపడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇప్పటికైనా వీరు ఇలా బయటకొచ్చి నిజాలు చెప్పడం హర్షించదగ్గ విషయం అని అంటున్నారు.