Allu Arjun : ఈ మధ్య స్టార్ హీరోలు తమ టీమ్ మెంబర్స్కి చాలా విలువైన బహుమతులను ఇస్తూ సర్ప్రైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ చిత్ర యూనిట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ హీరో ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. యూనిట్ మొత్తానికి ప్రభాస్ రిస్ట్ వాచ్ లను గిఫ్టులుగా ఇచ్చాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్లందరికీ ఖరీదైన వాచ్లను పంపించాడని సమాచారం. దీంతో ప్రభాస్ మనసు నిజంగా చాలా పెద్దది అని ఆయనిచ్చిన గిఫ్ట్ లను చూసి యూనిట్ సభ్యులు మురిసిపోయారు.
ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా పుష్ప టీమ్ కి బంగారు ఉంగరాలను గిఫ్ట్లుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా 12 మంది సిబ్బందికి ఒక తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారట. ఐటమ్ సాంగ్ షూట్ చివరి రోజైన సోమవారం ఉంగరాలను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బందికి ఇచ్చారట.
హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో అల్లు అర్జున్, సమంతలపై ఈ పాటను చిత్రీకరించారు. సాంగ్ని త్వరగా కంప్లీట్ చేసిన క్రమంలో ఆయన ఈ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘ఆర్య, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం పుష్ప.. వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.