Adivi Sesh Major : కరోనా వైరస్ మూడో వేవ్ కారణంగా ఇప్పటికే అనేక చిత్రాలు పోస్ట్పోన్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ జాబితాలోకి తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ వచ్చి చేరింది. కరోనా కారణంగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలు వాయిదా పడ్డాయి. కాగా మేజర్ సినిమాకు గాను త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రస్తుత తరుణంలో దేశంలో చాలా చోట్ల కోవిడ్ ఆంక్షలు, కఠిన నియమాలు ఉన్నాయి. అందువల్ల మేజర్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. మేజర్ సినిమాను భారతీయ సినీ ప్రేక్షకుల కోసం తీశాం. అందువల్ల దేశంలో పరిస్థితులు చక్కబడ్డాకే మూవీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కనుక అప్పటి వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. కరోనా నుంచి సురక్షితంగా ఉండండి.. అంటూ చిత్ర యూనిట్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
కాగా మేజర్ మూవీని పలు యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. 2008లో ముంబై దాడుల్లో ఆత్మత్యాగం చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అడివి శేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. శశి కిరణ్ తిక్క ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ సంస్థలు సహ నిర్మాణ బాధ్యతలను వహిస్తున్నాయి. ఇక త్వరలోనూ ఈ మూవీ విడుదలకు సంబంధించి కొత్త తేదీని ప్రకటించనున్నారు.