జీవితం ఎప్పుడూ మన ముందు రెండు రకాల చాయిస్లను ఉంచుతుంది. ఇప్పుడు ఉన్న దుస్థితిని అనుభవిస్తూ దాన్నే తలచుకుంటూ కుమిలిపోతూ జీవితాన్ని అనుభవించడం. లేదా ఉన్న దుస్థితిని సవాల్ చేస్తూ కష్టాలను దీటుగా ఎదుర్కొంటూ, సవాళ్లను స్వీకరిస్తూ కష్టపడి జీవితంలో ముందుకు సాగడం, ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడం. ఇలా జీవితంలో ప్రతి ఒక్కరికీ రెండు చాయిస్ లు ఉంటాయి.
కానీ కొందరు మాత్రమే రెండో చాయిస్ను ఎంచుకుంటారు. కష్టాలకు ఎదురొడ్డి ముందుకు సాగుతారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. సమాజం ఎంత హేళన చేసినా సరే కుంగిపోకుండా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తారు. అవును.. ఆ మహిళ కూడా సరిగ్గా ఇలాగే చేసింది.
ఆమె పేరు హిమానీ బుందెల. ఇటీవలే కౌన్ బనేగా క్రోర్పతిలో రూ.1 కోటి గెలుచుకుంది. కానీ అదంత సులభంగా రాలేదు. ఆమె ఒక టీచర్. 2011లో ఆమె అనుకోని ప్రమాదంలో తన కంటి చూపును కోల్పోయింది. డాక్టర్లు అనేక సార్లు ఆపరేషన్లు చేశారు. అయినప్పటికీ ఆమెకు కంటి చూపును తెప్పించలేకపోయారు.
అయితే తన పరిస్థితిని తలచుకుని ఆమె బాధపడలేదు. కష్టాలను అధిగమించింది. ఎవరెన్ని హేళనలు చేసినా ధైర్యంగా ముందుకు సాగింది. టీచర్గా రాణిస్తోంది. తాను చదువు చెప్పే పిల్లలు కూడా తనలాగే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ముందుకు సాగాలని చెబుతుంటుంది. ఇక ఆమె కేబీసీలో గెలుచుకున్న రూ.1 కోటితో తనలాంటి వాళ్లకు సహాయం చేయడం కోసం ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్ను ఆమె ప్రారంభించనుంది. ఆమె చేస్తున్న పనికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.