శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేశ ప్రజలందరూ పెద్దఎత్తున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ శ్రావణ మాస పౌర్ణమి రోజు ప్రజలందరూ విష్ణుమూర్తిని స్మరిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అలాగే అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీకగా ఈ రోజు ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే రాఖీ పండుగ ఏ విధంగా పుట్టుకొచ్చింది అనే విషయాల గురించి సరైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ ఈ పండుగ జరుపుకోవడానికి మన పురాణాలలో ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి రాఖీ పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
పురాణాల ప్రకారం రాక్షస రాజైన బలి చక్రవర్తి తన భక్తితో విష్ణుమూర్తిని బంధిస్తాడు. ఈ క్రమంలోనే స్వామివారిని బలిచక్రవర్తి చెర నుంచి తప్పించడం కోసం లక్ష్మీదేవి సాధారణ స్త్రీ రూపంలో అక్కడికి చేరుకుంటుంది. బలిచక్రవర్తి చేతికి రాఖీ కట్టడంతో అందుకుగాను బలిచక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మని చెప్పగా అప్పుడు ఆ మహిళ తన నిజ స్వరూపంలోకి వచ్చి తన దగ్గర బందీగా ఉన్నటువంటి తన భర్తను విడిచి పెట్టమని చెబుతుంది. ఈ క్రమంలోనే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని వదిలి పెట్టాడు. అప్పటి నుంచి రాఖీ పండుగ రోజు ఏ సోదరి అయినా కానీ అడిగిన కోరికను సోదరుడు తీర్చడం ఆనవాయితీగా వస్తోంది.
మరో కథ విషయానికి వస్తే.. మన పురాణాల ప్రకారం ద్రౌపది – శ్రీ కృష్ణుల మధ్య అన్నా చెల్లెల అనుబంధం ఉంది. శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించే సమయంలో అతని చూపుడు వేలు నుంచి రక్తం కారడంతో అది చూసిన ద్రౌపది తన చీర కొంగుని చింపి శ్రీ కృష్ణుడి వేలికి కట్టింది. అందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి అన్నివేళలా తనకు అండగా ఉంటానని మాట ఇచ్చాడు. ఈ క్రమంలోనే ప్రతి శ్రావణ మాస పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు.