ఒక మనిషికి మృత్యువు ఏ వైపు నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడని నమ్మకం లేకుండాపోతోంది. మృత్యువుకు, వయస్సతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గత నెలరోజుల క్రితం తల్లి పోయిందన్న బాధలో కుటుంబమంతా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి ఆ కుటుంబం తేరుకుంటోంది. అయితే ఆ కుటుంబంలోని ఓ యువకుడు డ్యూటీకి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు. తీవ్ర గాయాల పాలై దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్ అనే యువకుడు అమెజాన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం డ్యూటీ నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తనకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకు వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనాథ్ టిప్పర్ రావడం గమనించి దానిని తప్పించపోయాడు. అయితే ఆ టిప్పర్ వేగంగా అతనిపై నుంచి వెళ్లడంతో శ్రీనాథ్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయం తెలిసిన తన తండ్రి, చెల్లి సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు. మమ్మల్నిద్దర్నీ వదిలి అమ్మ దగ్గరికి వెళ్లి పోయావా అన్నయ్యా.. అంటూ ఆ చెల్లెలి రోదన పలువురికి కంటతడి పెట్టించింది. ఈ విషయం తెలిసిన అతని బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి తనకు న్యాయం చేయాలని, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.