విధి అంటే అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులే మనకు మృత్యువును తెచ్చి పెడతాయి. ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో తెలియదు. రోజూ బస్సులో ఆఫీసుకు వెళ్లే ఆమె కరోనా కర్ఫ్యూ విధించారని సొంత వాహనంపై వెళ్లింది. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలై చనిపోయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లాకు చెందిన సంధ్య (23) అనే యువతి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తోంది. అయితే ఏపీలో కరోనా కారణంగా కర్ఫ్యూను విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నింటికీ అనుమతులు ఇచ్చారు. మధ్యాహ్నం 12 దాటితే ప్రజా రవాణా కూడా అందుబాటులో లేదు. కాగా రోజూ బస్సులో ఆఫీస్కు వెళ్లే సంధ్య కర్ఫ్యూ ఉందని, ఇంటికి రావడం కష్టమవుతుందని చెప్పి సొంత వాహనం స్కూటీపై వెళ్లింది.
కానీ మార్గమధ్యలో ఆమెను మృత్యువు బలిగొంది. దగదర్తి లైన్స్ నగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం ఆమె స్కూటీని ఢీకొంది. దీంతో ఆమె స్కూటీ నుంచి పక్కకు ఎగిరి పడింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అయితే కరోనా భయంతో ఎవరూ ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆమె కొంత సేపు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడి మృతి చెందింది. కాగా పోలీసులు ఆ వాహనం డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. రోజూలాగే తమ కుమార్తె బస్సులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆమె తల్లిదండ్రులు శోక సంద్రమయ్యారు.