ప్రస్తుత తరుణంలో సైబర్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ కొందరు మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో వారి నుంచి డబ్బులను దోచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. రూ.750 రీఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.72వేలు పోయాయి. వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్లో రూ.750కి ఓ షర్ట్ను ఆర్డర్ చేశాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా షర్ట్ డెలివరీ కాలేదు. దీంతో ఆ షర్ట్ ఆర్డర్ పెట్టిన వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేశాడు. తనకు షర్ట్ డెలివరీ కాలేదు కనుక రూ.750 రీఫండ్ చేయాలని కోరాడు.
అయితే నిజానికి అది ఒక ఫేక్ వెబ్సైట్. అందులో ఇచ్చిన నంబర్ కూడా ఫేక్. దీంతో వారు అతన్ని మోసం చేశారు. రూ.750 వెనక్కి ఇవ్వడానికి బదులుగా అతని బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలను సేకరించి అతని ఖాతాలో ఉన్న రూ.72,727 కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.