రోజు రోజుకూ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధి చెందుతున్న కాలంలో చాలా మంది వారి ఆలోచనా విధానాలను కూడా మార్చుకున్నారు. ప్రస్తుత కాలంలో ఆడపిల్ల అంటే అదృష్టం, ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టిందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు మూర్ఖులు కూడా ఉన్నారు. ఆడపిల్ల, మగపిల్లవాడు అనే లింగ భేదం చూపిస్తూ తమకు కొడుకే కావాలని కొడుకు కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది. తనకు కొడుకు కావాలని తన భార్యకు తెలియకుండా ఏకంగా ఎనిమిది సార్లు అబార్షన్ చేయడమే కాకుండా ఆమెకు 1500 వందల ఇంజెక్షన్లను వేయించి ఆమెను ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 2007వ సంవత్సరంలో ఆ వ్యక్తి పెళ్లి చేసుకోగా అతని భార్య 2009లో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వృత్తిపరంగా తన భర్త, అత్త న్యాయవాదులు. తన ఆడపడుచు డాక్టర్. ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఈ విధమైన దారుణానికి పాల్పడ్డారని సదరు మహిళ తన కుటుంబ సభ్యుల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2009లో తన కూతురు పుట్టగానే తన భర్త హింసలు ఎక్కువయ్యాయని తన ఆస్తిని కాపాడటానికి వారసుడు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేసే వాడని తెలిపింది. తనకు తెలియకుండానే విదేశాలకు తీసుకెళ్లి ఆడపిల్ల అని ముందుగా తెలుసుకుని ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడని, మగ బిడ్డకు జన్మనివ్వడం కోసం 1500 హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇప్పించారని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరీక్షలు భారతదేశంలో నిషేధించడం వల్ల తన భర్త తనను బ్యాంకాక్ తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.