Honor Killing: పిల్లలు పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం సహజమే. అయితే తల్లిదండ్రులు అంగీకరిస్తే సరి. లేదంటే వారు విడిపోయి జీవిస్తుంటారు. కానీ కొందరు తల్లిదండ్రులు ఆ విషయాన్ని పరువుకు భంగం కలిగినట్లు తీసుకుంటారు. దీంతో తమ పిల్లలను ఆవేశంలో చంపేస్తుంటారు. ఇప్పటికే ఇలాంటి పరువు హత్యలకు చెందిన ఎన్నో సంఘటనల గురించి తెలుసుకున్నాం. తాజాగా అక్కడ కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న మకిన్పూర్ గ్రామంలో విజయ్పాల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని కుమార్తె కణిక (18) గతేడాది నవంబర్ లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి మీరట్లోని ఆర్య సమాజ్లో వివాహం జరిగింది. తరువాత వారు తమ పెళ్లిని రిజిస్టర్ చేయించారు.
అయితే పెళ్లి జరిగాక రెండు రోజులకు ఇంటికి వచ్చిన కణిక తనకు వివాహం అయిపోయిందని, ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జరిగిందేదో జరిగిపోయిందని సర్ది చెప్పారు. దీంతో కణిక భర్తతో కలిసి ఉంటోంది. అయితే కొన్ని నెలల తరువాత.. అంటే.. ఈ ఏడాది జూన్లో తన పుట్టిన రోజు వేడుకలకు రావాలని కణికను తండ్రి విజయ్పాల్ పిలిచాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
అయితే తండ్రి కుట్రను గ్రహించలేని ఆమె బలైపోయింది. ఆమెను గొంతు నులిమి చంపేశాడు. మెడకు శాలువా బిగించి ఉరివేసి చంపాడు. తరువాత కణిక మృతదేహాన్ని గంగానదిలో పడేశాడు. అయితే కణిక రాకపోయే సరికి ఆందోళన చెందిన ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే తనకు తన తండ్రి, సోదరుడి నుంచి ప్రాణహాని ఉందని, తనకు ఏమైనా అయితే వారిదే బాధ్యత అని కణిక అంతకు ముందే ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో అక్కడ వైరల్ అయింది. దీంతో అందులో ఉన్న కణికను గుర్తించిన పోలీసులు ఆమె తండ్రిని, సోదరున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో కణిక తండ్రి విజయ్పాల్ చేసిన నేరం అంగీకరించాడు. తన కుమార్తెను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని నదిలో పారవేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు.