రాజస్థాన్ పోలీసులు క్రూర మృగం లాంటి ఓ నిందితున్ని 24 గంటల్లోనే పట్టుకున్నారు. మొత్తం 700 మంది పోలీసులు ఎప్పటి కప్పుడు నిఘా ఉంచి నిందితున్ని ట్రేస్ చేయగలిగారు. ఓ 4 ఏళ్ల బాలికను అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితున్ని అత్యంత వేగంగా పట్టుకోగలిగారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని జైపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో సురేష్ కుమార్ (25) అనే వ్యక్తి దారిలో వెళ్తూ ఇంటి బయట ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అక్కడికి 5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్ద ఆ బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశాడు. అయితే ఆ తరువాత అతను పారిపోయాడు.
ఈ క్రమంలో ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితున్ని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జైపూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ శంకర్ దత్ శర్మ ఆధ్వర్యంలో 700 మంది పోలీసులు రంగంలోకి దిగారు. సదరు నిందితున్ని ట్రేస్ చేశారు.
అయితే సురేష్ కుమార్ వద్ద ఫోన్ లేదు. దీంతో అతన్ని ట్రేస్ చేయడం ఒక దశలో కష్టతరం అయింది. అయినప్పటికీ స్థానికంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ల ద్వారా అతని కదలికలపై నిఘా ఉంచారు. దీంతో 24 గంటల్లోనే నిందితున్ని పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.