ఒక ఇంట్లో రాత్రి భోజనంలో భాగంగా చేపల కూర తిన్న ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. మరో వ్యక్తి హాస్పిటల్లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర సంఘటన బీహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బీహార్లోని చాప్రాలో ఉన్న దరియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాధర్వర గ్రామంలో సోమవారం సాయంత్రం సుభాష్ రాయ్ (5) చేపల కూర వండాడు. దాన్ని తన ఇద్దరు కుమారులు బాలాజీ రాయ్ (18), మిథిలేష్ రాయ్ (22)లతోపాటు మేనల్లుడు విరాజ్ రాయ్ (5) తిన్నాడు. అయితే కూరను తిన్న వెంటనే వారి పరిస్థితి విషమించింది. దీంతో బాలాజీ, విరాజ్ ఇంట్లోనే చనిపోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ సుభాష్ మృతి చెందాడు. మిథిలేష్ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. పాట్నాలోని ఓ హాస్పిటల్లో అతనికి చికిత్సను అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సుభాష్ ఇంటికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వంట వండిన ప్రదేశాన్ని గమనించారు. ఆ చేపల కూరను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. బహుశా ఫుడ్ పాయిజనింగ్ అవడం వల్లే వారు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చేపల కూరను పరీక్షించాక అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.