ఆవు పేడలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. అందుకనే ఆవు మూత్రంతోపాటు పేడను హిందువులు పవిత్రంగా భావిస్తారు. అయితే ఆవుపేడతో ప్రస్తుతం అనేక రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయంలో చత్తీస్గఢ్కు చెందిన మహిళలు ముందున్నారు. వారు ఆవుపేడను టోకున కొనుగోలు చేసి వాటితో పలు రకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల నెలా ఎన్నో లక్షల రూపాయాల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
చత్తీస్గడ్లో మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం కోసం అక్కడ ప్రభుత్వం ఆవు పేడను విక్రయిస్తూ వాటి ద్వారా ఉత్పత్తులను తయారు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఆవు పేడతో పిడకలు, సబ్బులు, షాంపూలు, అగర్ బత్తీలు, షేవింగ్ క్రీమ్లు, సన్ స్క్రీన్ లోషన్స్, ఫేస్ వాష్లు, ఎరువులను తయారు చేస్తూ మహిళలు డబ్బులు సంపాదిస్తున్నారు.
ఆవు పేడతో ఆ రాష్ట్రంలో సుమారుగా 4000 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వారు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసుకుని కలసి కట్టుగా పనిచేస్తున్నారు. మొత్తం 354 గ్రూపులు ఈ విధంగా పనిచేస్తున్నాయి. వారికి ఆవు పేడను కిలోకు రూ.2 కు విక్రయిస్తారు. దీంతో రైతులకు కూడా మేలు జరుగుతుంది. అలా ఆవు పేడను వారు కొని దాంతో పైన తెలిపిన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఆ పేడతో కుండలు, ప్రమిదలను కూడా తయారు చేస్తున్నారు.
ఇక వారు ఇప్పటికే రూ.5 కోట్ల వ్యాపారం చేయగా, ఇటీవల ఆన్లైన్లోనూ తమ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు. దీంతో వాటికి కూడా ఆదరణ లభిస్తోంది. కొద్ది రోజుల కిందటే ఆన్లైన్లో ఆయా ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించగా ఇప్పటికే రూ.1 లక్ష వరకు వ్యాపారం జరిగింది. ఆన్లైన్ ద్వారా పెద్ద ఎత్తున ఆవు పేడ ఉత్పత్తులను అమ్మేందుకు అవకాశం ఉంటుంది, దాంతోపాటు లాభాలు కూడా వస్తాయి.. కనుక వారు ఆన్లైన్ బాట పట్టారు. మహిళలే కాదు, ఇలా ఎవరైనా సరే ఆవు పేడతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తే ఎప్పటికప్పుడు చక్కని ఆదాయం పొందవచ్చు. ఇదొక చక్కని స్వయం ఉపాధి మార్గం కూడా అవుతుంది.