కరోనా వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి బతుకు బండిని ఈడుస్తుంటే కొందరు అప్పటికే నిండా కష్టాలతో జీవనం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిలో ఆ మహిళ కూడా ఒకరు. ఆమె పీజీ చదివింది. అయినప్పటికీ విధివశాత్తూ స్వీపర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది. కానీ మంత్రి కేటీఆర్ చొరవతో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లాకు చెందిన రజని అనే మహిళ 2013లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. పీజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అయితే ఆమెకు హెచ్సీయూలో పీహెచ్డీ చేసేందుకు ఆఫర్ వచ్చింది. కానీ ఆమెకు వివాహం అవడంతో పీహెచ్డీ చేయలేదు. ఆమె భర్త అడ్వకేట్. కానీ ఆయనకు గుండె జబ్బు రావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారం రజనిపై పడింది. ఈ క్రమంలోనే ఆమె మొదట్లో తోపుడు బండిపై కూరగాయలు అమ్మేది.
అయితే తరువాత ఆమె జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్గా చేరింది. నెలకు రూ.10వేలు వచ్చేవి. కానీ అవి ఆమెకు ఏమాత్రం సరిపోయేవి కావు. దీంతో ఆమె దుర్భరమైన జీవితాన్ని గడుపుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్వయంగా ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకుని ఆమెకు జీహెచ్ఎంసీలోనే ఉన్నత స్థాయిలో ఉద్యోగం ఇచ్చారు. ఆమెను ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా నియమించారు. దీంతో ఆమె మంత్రి ఎదుట భావోద్వేగానికి గురైంది. తన కష్టాలు తెలుసుకుని తనకు ఈ జాబ్ ఇప్పించినందుకు ఆమె మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.