సాధారణంగా వినాయక చవితి ఉత్సవాలు వస్తే వినాయకుడి ప్రతిమలను తొమ్మిది రోజుల పాటు పూజించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే వినాయకుడి విగ్రహాలను చెరువులు, నీటి కుంటలలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా వినాయకుడి నిమజ్జనం షవర్ కింద చేయడం చూశారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లి హరితవనం కాలనీలో ఈవిధంగా నిమజ్జనం చేశారు.
గత పది సంవత్సరాల నుంచి కాలనీవాసులు కేవలం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ నిమజ్జనాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది భిన్నంగా వినాయకుడి నిమజ్జనం చేయాలని ఉద్దేశించిన వీరు 8.5 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని షవర్ కింద ఏర్పాటు చేశారు.
వినాయకుడి విగ్రహ నిమజ్జనం కోసం 50 వేల రూపాయలతో ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసి దానిపై మోటార్ సహాయంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన వినాయకుడి నిమజ్జనం మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు పూర్తయింది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నిజాంపేట్ కార్పొరేటర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఈ నిమజ్జనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.