భార్యా భర్తల మధ్య అనుబంధం ఎంతో గొప్పదని చెబుతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. అయితే తుని మండలం కొత్తసూరవరంలో దంపతులు మృత్యువులో కూడా ఆ బంధాన్ని వీడలేదు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కర్ర త్రిమూర్తులు, రామలక్ష్మి దంపతులు శుక్రవారం ఉదయం ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
వీరిద్దరూ గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంత కాలంగా త్రిమూర్తులు అనారోగ్యంతో బాధపడుతుండగా రామలక్ష్మి కూడా కాలు విరిగి మంచానికే పరిమితం అయింది. ఈ సమయంలోనే శుక్రవారం ఉదయం త్రిమూర్తులు తన భార్య కోసం టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు.
ఇలా బయటకు వెళ్లిన త్రిమూర్తులు బయటికి వెళ్లిన చోటే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని ఇంటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో అతని భార్య రామలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై షాక్తో ప్రాణాలను కోల్పోయింది. ఈ విధంగా ఒకేసారి ఈ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకి వివాహం జరిగి 35 సంవత్సరాలు అయినప్పటికీ వీరికి పిల్లలు లేరు. దీంతో వీరి అంతిమ సంస్కారాలను బంధువులు నిర్వహించారు.