తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది. తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 172 జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 18, 2021 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా 10 అక్టోబర్ 2021 వరకు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ ఖాళీలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నందువల్ల విద్యార్హతలతోపాటు పలు క్రీడలలో అర్హత సాధించి ఉండాలని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గైడ్లైన్స్ పూర్తి చేసి ఉన్నవారు అర్హులు.
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలి. జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.400 ఫీజుగా నిర్ణయించారు. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వంద మార్కులకు ఒక పేపర్ చొప్పున రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలుగా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలను కేటాయించారు. దరఖాస్తులకు అక్టోబర్ 10 చివరి తేదీ.