బీహార్లోని ఖగారియా జిల్లాలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఆ బ్యాంక్ సిబ్బంది పొరపాటున కొన్ని లక్షల రూపాయలను జమ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు కలగజేసుకోక తప్పలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్లోని ఖగారియా జిల్లా భక్తియార్పూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్కు అక్కడి గ్రామీణ్ బ్యాంకులో అకౌంట్ ఉంది. అయితే అతని అకౌంట్లో ఆ బ్యాంకు సిబ్బంది పొరపాటున రూ.5.50 లక్షలను వేశారు. దీంతో తప్పు జరిగిందని తెలుసుకుని ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తీసి వాడుకున్నాడు.
బ్యాంకు వారు ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని, పొరపాటున పడిందని ఎంత చెప్పినా అతను వినలేదు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తారని చెప్పారని, అందులో భాగంగా మొదటి ఇన్స్టాల్ మెంట్ కింద ఆ మొత్తాన్ని వేశారని అతను బ్యాంకు వాళ్లకు చెప్పాడు. అంతేకాదు, ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రికవరీ చేసేలోగానే అతను విత్డ్రా చేసేశాడు. అడిగితే ఖర్చు పెట్టానన్నాడు. దీంతో పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా.. వారు రంజిత్ దాస్ను అరెస్టు చేశారు.