సృష్టిలో తల్లి అంటే అందరికీ ఎంతో గౌరవం ఉంటుంది. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లి దృష్టిలో వారు మంచివారుగానే ఉంటారు. అంటే.. తల్లిప్రేమ అలా ఉంటుందని అర్థం. ఆ ప్రేమకు వెలకట్టలేం. కానీ ఆ కసాయి తల్లి మాత్రం కన్ను మిన్నూ కానకుండా ప్రవర్తించింది. తన వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తుందని తన కన్న కూతుర్ని గొంతు నులిమి చంపేసింది. అందుకు ఆమెకు తన తల్లి కూడా సహకరించడం విశేషం. తల్లి, అమ్మమ్మ కలిసి ఆ చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్ కాలనీలో వడ్డె యాదమ్మ (30), రాములు అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి 2011 లో వివాహం అయింది. నలుగురు పిల్లలు జన్మించారు. కానీ అనారోగ్యం కారణంగా వారిలో ఇద్దరు చనిపోయారు. ఈ క్రమంలో వారు 2013లో శివాజీ నగర్ అనే మరో కాలనీకి మకాం మార్చారు. అక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
అయితే యాదమ్మ, రాములు ఇద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కానీ గత 3 ఏళ్లుగా యాదమ్మ మద్యానికి బానిస అయింది. విపరీతంగా కల్లు తాగేది. ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తుండేది. ఈ క్రమంలో భర్త రాములు ఆమెను విడిచి పెట్టి సొంత ఊరికి వెళ్లిపోయాడు. దీంతో యాదమ్మ తన తల్లి తిమ్మమ్మ, కుమార్తె కృష్ణవేణి (5)తో కలిసి నివసిస్తోంది.
అయితే ఇతర వ్యక్తులతో తాను కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాలకు తన కుమార్తె కృష్ణ వేణి (5) అడ్డు వస్తుందని భావించిన యాదమ్మ ఆ పాపను చంపేందుకు పథకం వేసింది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కుమార్తె కృష్ణవేణిని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. తరువాత యాదమ్మ తల్లి తిమ్మమ్మ అక్కడకు వచ్చింది. కానీ తన మనవరాలిని చంపినందుకు తన కుమార్తెను ఆమె పోలీసులకు పట్టించలేదు. పైగా ఆ నేరాన్ని పక్కనే నివాసం ఉంటున్న ఇంకో వ్యక్తి మీద నెట్టబోయారు. అయితే విషయం తెలుసుకున్న రాములు చందానగర్కు వచ్చి తన భార్య యాదమ్మ, అత్త తిమ్మమ్మలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిని అరెస్టు చేసి విచారించారు. ఈక్రమంలో వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. దీంతో నిందితులను రిమాండ్ కు తరలించారు.