యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో టాప్ ర్యాంకును సాధించి ఐఏఎస్ అవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో కష్టపడాలి. బాగా చదవాలి. నిరంతరాయంగా చదువుతూనే ఉండాలి. ఈ క్రమంలోనే కొందరు కొన్ని సార్లు ప్రయత్నించి టాప్ ర్యాంకు సాధిస్తారు. కొందరు మొదటి ప్రయత్నంలోనే టాప్ ర్యాంకును సాధిస్తారు. అలాంటి వారిలో సిమి కరణ్ ఒకరు.
సిమి కరణ్ ఒడిశా వాసి. ఆమె తండ్రి భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. అందువల్ల ఆమె స్కూల్ విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. ఆమె తల్లి గృహిణి. ప్లస్ 2 తరువాత ఆమెకు ఐఐటీ బాంబేలో సీటు వచ్చింది. దీంతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ను ఎంచుకుంది. అయితే ముంబైలో ఆమె ఇంజినీరింగ్ చదువుతుండగా అక్కడి మురికి వాడల్లో ఉన్న పేదల జీవితాలను చాలా దగ్గరగా చూసింది. దీంతో అప్పుడే ఆమె సివిల్స్ రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే సివిల్స్కు ప్రిపేర్ అయింది.
చివరకు 2019లో మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్ సాధించింది. ఆలిండియా స్థాయిలో ఆమెకు యూపీఎస్సీలో 31వ ర్యాంకు వచ్చింది. దీంతో ఆమె ఐఏఎస్ అయింది. అయితే ఐఏఎస్ అవ్వాలని అనుకునేవాళ్లకు ఆమె కొన్ని సలహాలు కూడా ఇస్తోంది.
తాను నిత్యం యూపీఎస్సీ టాపర్లకు చెందిన వీడియోలను, మోటివేషనల్ స్పీచ్లను వినేదాన్నని, దీంతో తనకు ఎంతగానో ప్రేరణ లభించిందని ఆమె తెలిపింది. అలాగే అనేక రకాల పుస్తకాలను కలెక్ట్ చేసి సిలబస్ను మూడు భాగాలుగా విభజించి చదివానని, రోజుకు 8-10 గంటల పాటు చదివేదాన్నని తెలిపింది. అందువల్లే ఐఏఎస్ అయ్యాయని వివరించింది.
ఐఏఎస్ అవ్వాలనుకునే ఎవరైనా సరే ముందుగా ఒక గోల్ పెట్టుకుని దానికి అనుగుణంగా ప్రణాళికా బద్దంగా చదవాలని, దీంతో సక్సెస్ను సాధిస్తారని ఆమె తెలియజేసింది. ఇలా ఎంతో మందికి ఆమె ప్రేరణగా నిలుస్తోంది.