ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష చతుర్దశి రోజు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవడం కోసం మార్కెట్లో ఎన్నో రకాల వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉత్సవాలలో భాగంగా భక్తులు వారికి ఇష్టమైన వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠించి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా సాధారణంగా ఎప్పుడు పూజ చేసినా ఏ విధమైన వినాయక విగ్రహాలను పూజిస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
తొండం ఎడమవైపు ఉన్న వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో ఏ విధమైన వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోయి మనం చేపట్టే ప్రతి కార్యం ఎంతో విజయవంతం అవుతుంది. అదేవిధంగా తొండం కుడి వైపు ఉన్న వినాయకుడిని పూజించడం ఎంతో శుభకరం. అయితే ఇలాంటి వినాయకుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అలాగే తొండం మధ్యలో ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం వల్ల మన ఇంట్లో దుష్టశక్తుల పీడ నశించి పోతుంది.
తెలుపు రంగు వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో శాంతియుతంగా ఉండటమే కాకుండా దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. రావి ఆకు ఆకారంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి, అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. వెండి గణేషుడిని పూజిస్తే పేరు ప్రఖ్యాతలు, చెక్కతో తయారు చేసిన గణేషుడిని పూజిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.