ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతుల ఆర్థిక ఎదుగుదల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందే పథకాలను రైతుల కోసం తీసుకువస్తున్నారు. రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకంలో చేరిన రైతులు ప్రతి నెల రూ.3000 పెన్షన్ ని పొందవచ్చు. అసలు ఈ పథకం ఉద్దేశం ఏమిటి, ఈ పథకంలో ఎలా చేరాలి.. అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఈ పథకంలో 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న రైతులు చేరవచ్చు. ఈ పథకంలో చేరిన రైతులు ప్రతినెల రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రైతులు 60 సంవత్సరాలు వచ్చే వరకు డబ్బులను చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత రైతులకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ రూపంలో అందుతుంది. అయితే ఐదు ఎకరాల లోపు పొలం కలిగిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
కొన్ని కారణాల వల్ల రైతులు మధ్యలోనే డబ్బులను జమ చేయడం ఆగిపోతే అప్పటి వరకు డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి తీసుకోవచ్చు. ఈ పథకంలో చేరిన రైతులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి భాగస్వామికి నెలకు రూ.1500 చొప్పున పెన్షన్ అందుతుంది. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకంలో చేరాలంటే ఆధార్ కార్డు, పొలం పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు.