కరోనా ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీని వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి పోయాయి. దీంతో అనేక మంది తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాగే ఆ కుటుంబం కూడా మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని భోపాల్ శివారు ప్రాంతంలో ఉన్న సహారా ఎస్టేట్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న రవి థాకరే (56), రంజన (50)లు దంపతులు. వారికి టీనేజ్ వయస్సు ఉన్న ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్న రవి థాకరేకు కోవిడ్ కారణంగా జాబ్ పోయింది. గత 3 నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ లభించడం లేదు. ఈ క్రమంలో కుటుంబ పోషణ భారం కష్టమైంది. కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఆ దంపతులు ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని భావించారు.
శుక్రవారం ఇంట్లో తమ కుమారుడు, కుమార్తెలను ముందుగా వారు హత్య చేశారు. టైల్ కట్టర్తో వారి గొంతులను కోశారు. తరువాత ఆ దంపతులు విషం తాగారు. అయితే వారి కుమారుడు రితేష్ (16) వెంటనే చనిపోయాడు. తరువాత రవి మరణించాడు. ఈ క్రమంలోనే ఇరుగు పొరుగు వారు ఈ విషయం తెలుసుకుని వెంటనే రంజనతోపాటు వారి కుమార్తె గుంజన్ (14)ను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.