సూర్య, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన వీడొక్కడే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తమన్నా సోదరుడు కడుపులో మాదకద్రవ్యాలను దాచుకుని ఇతర దేశాలకు సరఫరా చేయడం మనం చూశాం. అచ్చం సినిమాని తలదన్నేలా ఓ వ్యక్తి కడుపులో ఏకంగా రూ.11 కోట్ల విలువైన కొకైన్ను దాచుకుని ప్రయాణిస్తుండగా బెంగళూరు విమాన అధికారులకు దొరికాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కడుపులో డ్రగ్ క్యాప్సుల్స్ దాచుకుని ఇండియాకు తరలించిన ఒక నైజీరియన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టుకు ఓ విమానం వచ్చింది. ఈ విమానంలో ఆఫ్రికాకు చెందిన ఆ వ్యక్తి ఆహారం, నీరు తీసుకోకపోవడంతో విమానయాన సిబ్బందికి అతనిపై అనుమానం వచ్చింది.
ఈ క్రమంలోనే విమానయాన సిబ్బంది అతని గురించి వెంటనే డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తి విమానం దిగగానే అతడితో పాటు అతని లగేజ్ ను డీఆర్ఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినప్పటికే వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ ఆ వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అతనిని ఆసుపత్రికి రావలసిందిగా కోరారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి తానేమి తప్పు చేశానని తనకు పరీక్షలు చేయిస్తున్నారంటూ వారితో వాగ్వాదానికి దిగాడు.
కొద్దిసేపటి తర్వాత తన కడుపులో ఏదో అసౌకర్యంగా ఉండడంతో స్వయంగా తానే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా అధికారులకు దిమ్మతిరిగే విషయం తెలిసింది. సదరు వ్యక్తి తన కడుపులో ఏకంగా కొకైన్ క్యాప్సుల్స్ దాచుకున్నాడని వాటన్నింటిని బయటికి తీయగా సుమారుగా 1.25 కేజీల కొకైన్ ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ కొకైన్ ఏకంగా రూ.11 కోట్ల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అయితే అతడు ఎవరి నుంచి ఎవరికికీ సరఫరా చేస్తున్నాడు, ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరున్నారు ? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.