తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి లో ఫార్మాసిటీ కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఇంటికొక ఉద్యోగం దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఈ ఫార్మాసిటీ కోసం రైతులకు నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తామని తెలిపింది.
ఈ క్రమంలోనే పది ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి శిక్షణ తరగతులను ప్రారంభించారు. రెండు నెలల పాటు శిక్షణ అనంతరం వీరిని విధుల్లోకి తీసుకొనున్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది.ఈ క్రమంలోనే మొదటి బ్యాచ్ కింద 120 మంది యువతను ఎంపిక చేసి వారికి సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే యువత విద్యార్హతల ఆధారంగా ఆయా కోర్సుల్లో టీఎస్ఐఐసీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. క్వాలిటీ కంట్రోలర్, డ్రైవింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రొడక్షన్ ఆపరేటర్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వివిధ పనుల కోసం యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రెండు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం వీటిని విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ శిక్షణ లో భాగంగా వీరికి ఒక పూట భోజనంతో పాటు వెళ్లి రావడానికి ట్రాన్స్ పోర్ట్ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుందని తెలిపారు ఈ శిక్షణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది.