సాధారణంగా మనం పాముకాటుకు గురైతే వెంటనే ఆ పామును చంపి దానిని ఆస్పత్రికి తీసుకువెళ్లి సరైన చికిత్స తీసుకుంటాము. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు పాము కరిచిందన్న కోపంతో ఆ పామును వెంటాడి వేటాడి దానిని నోటితో కసకస కొరికి చంపేశాడు. అయితే పామును అయితే చంపాడు కానీ ఆ వ్యక్తి కూడా ప్రాణాలను కోల్పోయిన ఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాధోపూర్ గ్రామానికి చెందిన 65ఏళ్ల రామా మహతోని అనే వ్యక్తి శనివారం రాత్రి పాముకాటుకు గురయ్యాడు. ఈ క్రమంలోనే పాము పై ఎంతో కోపంతో దానిని వెంటాడి కసకసా నమిలాడు.మహతో చేస్తున్న ఈ పనిని చూసిన కొందరు గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యానికి లోనై అతనిని వారించారు. అయితే గ్రామస్తుల మాటలను పెడచెవిన పెట్టిన మహతో ఆ పామును కసితీరా కొరికి తన ఇంటి పక్కనే ఉన్న చెట్టుపై వేలాడదీశాడు. పామును చంపేశాను కనుక నాకేం కాదు అంటూ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే రాత్రి భోజనం చేసి అందరూ నిద్రపోయి ఉండగా తెల్లవారుజామున మహతో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.