మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దాదాపుగా 35 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ దసరా రోజు ఇంటికి చేరుకున్నాడు. దీపావళి రోజు మెగా హీరోలు అందరితో కలిసికట్టుగా ఫొటో దిగి మెగా అభిమానులకి అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఇక సాయి ధరమ్ ఇంతకు ముందులా మళ్లీ ఎప్పుడు పలకరిస్తాడా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.
నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్కు వాయిస్ మెసేజ్ పంపించాడు తేజూ. ఈ మెసేజ్కు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో మెసేజ్ ఉంది. నేను మీ సాయిధరమ్ తేజ్.. మీరు నా మీద చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నా ఆరోగ్యంపై మీరు చూపించిన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను.. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను.
కానీ ఇప్పుడు నవంబర్ 26న ఈ సినిమా జీ 5లో విడుదల అవుతోంది. ఈ సినిమాను చూసి మీ అభిప్రాయాలు నాకు తెలపండి అంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 1న విడుదలైన రిపబ్లిక్ దాదాపుగా 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతోంది.
ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సాయితేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని పేర్కొన్నారు. సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయితేజ్ చివర్లో జై హింద్ అని ముగించారు.