టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కొత్త స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్ను ఇటీవలే దీపావళి సందర్బంగా భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ను కేవలం ప్రీ ఆర్డర్ల ద్వారా లేదా వాట్సాప్ లేదా జియో వెబ్సైట్ ద్వారా ముందుగా రిజిస్టర్ చేసి కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
జియో నెక్ట్స్ ఫోన్ను ఇకపై వినియోగదారులు నేరుగా రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్ ద్వారా సులభంగానే కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఈ ఫోన్ను కొనేందుకు ఇకపై ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన పనిలేదు. వెంటనే కొనుగోలు చేయవచ్చు. అయితే ఫోన్ను కొనేందుకు గాను పూర్తి చెల్లింపు ముందుగానే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి క్యాష్ ఆన్ డెలివరీ సౌలభ్యాన్ని అందించడం లేదు.
ఇక ఎవరైనా గ్రామ ప్రజలు ఈ ఫోన్ ను బుక్ చేస్తే వారు తమకు దగ్గరలో ఉండే జియో స్టోర్ కి వెళ్లి ఫోన్ను తీసుకోవచ్చు. కాగా జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్లో.. 5.45 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే, స్నాప్డ్రాగన్ క్యూఎం 215 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, మెమొరీని 512 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 13 మెగాపిక్సల్ కెమెరా వెనుక, 8 మెగాపిక్సల్ కెమెరా ముందు, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.6,499గా ఉంది.