Huzurabad : హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. తన సమీప తెరాస పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై ఆయన 23వేల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత 6 నెలల నుంచి హుజురాబాద్లో బీజేపీ, తెరాసలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఉప ఎన్నికకు గాను ఓట్ల కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో మొదటి నుంచి ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. మొదటి రౌండ్ నుంచే ఈటల ఆధిక్యంలో కొనసాగారు. కేవలం రెండు రౌండ్లలోనే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ఈ క్రమంలోనే ఈటలకు భారీ మెజారిటీ లభించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమే అయ్యాయి.
దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ ఈటల గెలుస్తారని చెప్పారు. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్లో ఈటలకు 20వేలకు పైగా మెజారిటీ వస్తుందని అన్నారు. చెప్పినట్లుగానే అంతే మెజారిటీ రావడం విశేషం. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకుంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు 96,581 ఓట్లు పోలవ్వగా, గెల్లు శ్రీనివాస్కు 75,566 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బి.వెంకట్కు కేవలం 2767 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఈ ఉప ఎన్నికలో తెరాసకు పట్టు ఉన్న గ్రామాల్లోనూ బీజేపీ పైచేయి సాధించింది. ఓ దశలో తెరాస భారీ ఎత్తున ఓటుకు ఏకంగా రూ.10వేల వరకు పంచుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. కానీ గెలుపు అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తెరాస డబ్బు, మద్యం పంచినా.. ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారని అన్నారు.