Samantha : తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించారంటూ స్టార్ హీరోయిన్ సమంత కోర్టులో కొన్ని యూట్యూబ్ చానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలుసార్లు విచారణ అనంతరం ఎట్టకేలకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ తీర్పు సమంతకు ఊరట కలిగించేదే. అయినప్పటికీ ఆమె కూడా కోర్టు సూచనలను పాటించాల్సి ఉంటుంది.
కాగా సమంతపై ప్రసారం చేసిన వీడియోల తాలూకు యూట్యూబ్ లింక్లను వెంటనే డిలీట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితానికి చెందిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయరాదని, కామెంట్స్ చేయరాదని.. ఇంజెక్షన్ ఆర్డర్ను పాస్ చేసింది. ఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ విషయాల జోలికి వెళ్లకూడదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అయితే సమంత తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ కోర్టు ఆమెకు సూచించింది. సమంత తరఫున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.
కాగా నాగచైతన్యతో విడాకులు అని ప్రకటించినప్పటి నుంచి సమంతను తీవ్రంగా ట్రోల్ చేశారు. కొన్ని చానల్స్ అయితే లేని పోని ఆరోపణలు చేశారు. తప్పంతా ఆమెదేనన్నట్లు చూపించారు. దీంతో మనస్థాపం చెందిన సమంత కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి పలు సార్లు కేసు విచారణను వాయిదా వేసి ఎట్టకేలకు తీర్పు చెప్పారు.