Nivetha Thomas : కొందరు హీరోయిన్స్కి చాలా ధైర్యం ఉంటుంది. సాహసాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న కిలిమంజారో శిఖరం ఎక్కి అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది నివేదా థామస్. మంచుతో కప్పి ఉండే ఈ పర్వతం ప్రధాన శిఖరం కిబోను అందుకోవాలంటే 5,885 మీటర్లను అధిగమించాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురుగాలులను ఎదుర్కొని నిల్చోవాల్సి ఉంటుంది.
చాలా సాహసంతో నివేదా థామస్ ఈ శిఖరాన్ని ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉహురు పీక్ పాయింట్ వద్ద అమర్చిన డెస్టినేషన్ బోర్డు వద్ద ఫొటో దిగిన నివేదా థామస్ ఆ ఫొటోని తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. `ఐ మేడ్ ఇట్.. టు ద టూ ఆఫ్ ద టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటెయిన్ ఇన్ ద వరల్డ్.. మౌంట్ కిలిమంజారో..` అనే కామెంట్స్ను జత చేసింది.
కిలిమంజారో ట్రెక్కింగ్ కోసం నివేదా థామస్ సుమారు ఆరు నెలలుగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులతో కలిసి ఆమె ఈ ట్రెక్కింగ్ను కంప్లీట్ చేసిందని తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇటీవల ‘వకీల్ సాబ్’ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. నివేదా ఓ కీలక పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘మీట్ క్యూట్’లో నటిస్తోంది. ఈ సినిమాలో నివేదా థామస్తోపాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు.