ప్రస్తుతం మహిళలు, అమ్మాయిలపై రోజురోజుకూ ఎన్నో దాడులు, వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ వేధింపులను భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
తల్లాడకు చెందిన కుసుమరాజు వర్షిత ఆరల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే అదే ఆసుపత్రిలో పని చేస్తున్న మధుకుమార్ తనని ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలోనే వర్షిత అతన్ని ఎన్నోసార్లు తిరస్కరించింది. అతన్ని తిరస్కరించినప్పటికీ మధు కుమార్ తనను ప్రేమించాలని తన కోరిక తీర్చాలని ఫోన్ చేసి విసిగించే వాడు.
ఇలా ఆమెను ఎన్నో వేధింపులకు గురి చేసినా ఆమె ఎంతో ధైర్యంగా ఉండేది. కాగా వర్షితకు మధు కుమార్ ఒక రోజు ఫోన్ చేసి తను ప్రేమించకపోయినా, తన కోరికను తీర్చకున్నా, తనతో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేశానని వాటిని బయట పెడతానంటూ బెదిరించాడు.
మధు కుమార్ ఈ విధంగా బెదిరించడంతో ఎంతో మనస్తాపానికి గురైన వర్షిత చేసేదేమీలేక రోగులకు కొన్ని పరిస్థితులలో ఇచ్చే స్టెరాయిడ్ ఇంజక్షన్లను వేసుకుని మరణించింది. విషయం తెలుసుకున్న స్నేహితురాలు వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లికి చేరవేసి సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె వెళ్లి చూడగా వర్షిత విగత జీవిగా పడి ఉంది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.