RRR Movie : ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీలో నటించారు. అందరి అంచనాల నడుమ జనవరి 7వ తేదీన ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మూవీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే రూ.40 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే విడుదల వాయిదా పడడంతో ప్రమోషన్స్ కోసం పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరులా మారిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని తాజాగా ఓ వివాదం చుట్టు ముట్టింది. ఈ మూవీ విడుదలను ఆపేయాలని కోరుతూ ఓ యువతి కోర్టుకెక్కింది.
ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్గా, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. మొదట్నుంచీ మూవీ కల్పితమనే రాజమౌళి చెబుతూ వచ్చారు. అయితే ఈ మూవీపై తెలంగాణ హైకోర్టులో అల్లూరి సౌమ్య అనే యువతి పిల్ వేసింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య కోర్టులో పిల్ దాఖలు చేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. అయితే చారిత్రక యోధుల పాత్రలను రాజమౌళి వక్రీకరించి చిత్రీకరించారని, మహనీయుల అసలు చరిత్ర కాకుండా కాల్పనిక కథతో సినిమా తెరకెక్కించడంపై అభ్యంతరాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇప్పటికే జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయడంతోపాటు సినిమా విడుదలను నిలిపివేయాలని అల్లూరి వంశానికి చెందిన సౌమ్య పిల్ దాఖలు చేసింది.
కొమరం భీమ్, అల్లూరి వంటి యోధుల జీవితాలకు వ్యతిరేకంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారని ఆమె ఆరోపణలు చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ అధికారిగా పనిచేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఈ పిటిషన్లో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ లను చేర్చారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాపై వేసిన పిల్కు గాను హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.