కర్ణాటకలోని బెంగుళూరులో వికలాంగురాలైన నాలుగేళ్ల చిన్నారిని నాలుగవ అంతస్తు నుంచి తోసేసి చంపేసింది ఓ కన్న తల్లి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కిరణ్, సుష్మ భరద్వాజ్ అనే దంపతులు నివసిస్తున్నారు. భర్త కిరణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, భార్య సుష్మ డెంటిస్ట్. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది.
ఈ చిన్నారి ఎదుగుదల పుట్టినప్పటి నుంచి సరిగా లేదు. చిన్నారి మాట్లాడలేదు. మెదడు ఎదుగుదల సరిగా లేని బాలిక పరిస్థితిని చూసి ఆమె తల్లి సుష్మ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. దీంతో శుక్రవారం సాయంత్రం తల్లి సుష్మ తన ఇంటి నాలుగో అంతస్తు బాల్కనీలో తన బిడ్డను చేతుల్లో పట్టుకుని నిల్చుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని కిందకు తోసేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
నిందితురాలు సుష్మా భరద్వాజ్ తన బిడ్డను విసిరివేసిన అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందని, అయితే ఇరుగుపొరుగు వారు రక్షించారని పోలీసులు తెలిపారు. సుష్మా భర్త కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా సుష్మ భరద్వాజ్ తన కూతురిని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న కిరణ్ వెంటనే స్టేషన్కు చేరుకుని తమ కుమార్తెను గుర్తించాడని పోలీసులు తెలిపారు.