Loan : సాధారణంగా ఎవరైనా సరే లోన్ కోసం బ్యాంకుల్లో అప్లై చేస్తే.. మన క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోరు ఆధారంగా బ్యాంకు వారు లోన్లు ఇస్తారు. ఆ రిపోర్టులు సరిగ్గా లేకుంటే వారు లోన్ రిజెక్ట్ చేస్తారు. అయితే బ్యాంకులు మనకు లోన్లు ఇవ్వకపోతే తెలిసిన వారి దగ్గరో.. ఎక్కడో ఒక చోట అప్పు తీసుకుంటాం. కానీ ఆ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. తనకు లోన్ ఇవ్వలేదని ఏకంగా ఆ బ్యాంకునే తగలబెట్టేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కర్ణాటకలోని హవేరి జిల్లా రత్తిహల్లి టౌన్లో నివాసం ఉండే వసీమ్ హజరత్సాబ్ ముల్లా (33) అనే వ్యక్తి అక్కడి హెడుగొండ గ్రామంలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేశాడు. అయితే అతని సిబిల్ స్కోరు తక్కువగా ఉందని బ్యాంకు వారు అతని లోన్ అప్లికేషన్ను తిరస్కరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముల్లా వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లాడు.
రాత్రి పూట బ్యాంకు కిటికీ అద్దాలను పగలగొట్టి లోపల పెట్రోల్ చల్లాడు. తరువాత నిప్పంటించాడు. దీంతో బ్యాంకులో మంటలు వ్యాపించారు. ఆ తరువాత అటు వైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు చూసి సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేశారు.
అయితే అప్పటికే పలు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. 5 కంప్యూటర్లు, ఫ్యాన్లు, లైట్లు, పాస్ బుక్ ప్రింటర్, నగదును లెక్కించే మెషిన్, పలు పత్రాలు, సీసీటీవీ కెమెరాలు, క్యాష్ కౌంటర్లు అగ్నిలో దహనం అయ్యాయి. దీంతో బ్యాంకుకు రూ.12 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. అయితే జరిగిన ఘటనకు ముల్లాయే కారణం అని తెలుసుకున్న పోలీసులు.. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.