Rohini : బిగ్ బాస్ షో ఎందరో జీవితాలని మార్చేసింది. ఈ షోకి ముందు సాదా సీదా నటీనటులుగా ఉండే వాళ్లు బిగ్ బాస్ తర్వాత స్టార్ సెలబ్రిటీ స్టేటస్ పొందారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లాలు కొంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేం, బుల్లితెర నటి రోహిణి హైదరాబాద్లోని మణికొండలో డూప్లెక్స్ హౌస్ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ తెగ ఎగ్జైట్ అయింది.
కొంచెం కష్టం సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న రోహిణి.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఇప్పుడు ఈమె బుల్లితెర రాములమ్మగా అందరి చేత పిలిపించుకుంటోంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో రోహిణి ఓ స్కిట్ చేయగా, అచ్చం విజయశాంతిలానే నటించి మెప్పించింది.. గ్యాంగ్ లీడర్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, ఒసేయ్ రాములమ్మ, ప్రతిఘటన, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో విజయశాంతి చేసిన కొన్ని సన్నివేశాలు, పాటలను తీసుకొని ఆ పాత్రలకు తగ్గట్టుగా వస్త్ర ధారణ చేసి బాగా పర్ఫామెన్స్ చేసింది.
Rohini : సొంతింటి కలను నిజం చేసుకున్న రోహిణి
తాజాగా సొంతింటి కలను నిజం చేసుకున్న రోహిణి.. ఇంట్లోకి తన తల్లిని తీసుకెళ్లి చూపించింది. ప్రేక్షకుల కోసం హోమ్ టూర్ వీడియోను యూట్యూబ్లో షేర్ చేసింది. హాల్, కిచెన్, బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, సిట్టింగ్ ఏరియా, టెర్రస్ను అంతా చూపిస్తూ సందడి చేసింది. త్వరలోనే ఈ ఇంటిని తనకు నచ్చినట్లు మరింత అందంగా మార్చేస్తానని పేర్కొంది రోహిణి.