Allu Arjun : టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించగా, దీనికి వేలాది మంది తరలి వచ్చారు.
బన్నీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం పోలీసులకి, నిర్వాహకులకి తలకు మించిన భారంగా మారింది. ఈ ఈవెంట్లో తొక్కిసలాట జరగడంతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లు అర్జున్ తన అభిమానులతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్కన్వెన్షన్ సెంటర్లో ఫ్యాన్స్తో ఫోటో సెషన్ నిర్వహించారు. అయితే అభిమానులు భారీగా పోటెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. పలువురు అభిమానులు గాయపడ్డారు.
దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్లో పలువురు అభిమానులకు గాయాలయ్యాయని తెలిసింది. నా వ్యక్తిగత టీమ్ దానిపై మానిటరింగ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రతి విషయం నాకు చేరవేస్తున్నారు. వారిని బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాదని నా వైపునుంచి హామీ ఇస్తున్నా. మీ ప్రేమ, అభిమానాలు నాకు పెద్ద అసెట్. వారి ప్రేమని ఎప్పుడూ లైట్ తీసుకోను` అని తెలిపారు.