ఆగస్టు 22వ తేదీన రాఖీ పౌర్ణమి కావడంతో దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు ,అక్కా తమ్ముళ్లు ఎంతో సంతోషంగా రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అన్న తన చెల్లితో రాఖీ కట్టించుకోవడం కోసం ఆమె ఇంటికి వెళ్లి తనతో ఎంతో సంతోషంగా రాఖీ కట్టించుకుని తన చెల్లికి బహుమతి అందించి తిరిగి ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్తున్న అన్నకు ఫోన్ వచ్చింది. అవతలి వారు చెప్పిన వార్త విని ఆ అన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తను సంతోషంగా ఉండాలని తన చేతికి రాఖీ కట్టిన ఆ చెల్లి ఇక ఎప్పటికీ తిరిగి రానీ లోకాలకు వెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన ఉష అనే యువతి గత రెండు సంవత్సరాల క్రితం ఫణి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తుండగా.. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాఖీ పండుగ కావడంతో తన అన్న సూర్యనారాయణ తన చెల్లి ఇంటికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాఖీ కట్టించుకుని ఆమెకు విలువైన బహుమతి ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు.
ఈ క్రమంలోనే సూర్యనారాయణ మార్గమధ్యంలో ఉండగా తన అత్తింటివారి నుంచి తన చెల్లి చనిపోయిందని వార్త రావడంతో సూర్యనారాయణ కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి వెళ్లి చూడటంతో తన చెల్లెలు విగతజీవువిగా పడి ఉండటం చూసి బోరున విలపించాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న తన చెల్లి ఇలా చనిపోవడానికి గల కారణం కేవలం తన అత్తింటివారని ఉష తల్లిదండ్రులు వారిపై పోలీస్ కేసు నమోదు చేశారు. అయితే తను ఇంట్లో ఉన్న ఫలంగా కళ్ళుతిరిగి పడిపోతే ఆస్పత్రికి తరలించామని ఫణి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.